.
పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం.
అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు.
త్వరలో భూభారతి టోల్ఫ్రీ నెంబర్.
గిరిజన ప్రాంత సమస్యలపై కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే ఆ చట్టం పేదవాడికి చుట్టంలాగా ఉండాలి.
ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుంది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
**
గత ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బి లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయితి రాజ్,
గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణ రావు, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట శాసన సభ్యులు నాగరాజు, ప్రిన్సిపాల్ సెక్రటరీ సి సిఎల్ ఏ రెవిన్యూ బుద్ధ ప్రకాష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. లతో భూభారతి పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదల కన్నీటిని తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం అన్నారు. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు.ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తాం అన్నారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని ఇప్పుడు ఇంకా ఆ అవసరం రైతులకు లేదని అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ధరణిపై గత పాలకులు ఏనాడు కూడా రెవెన్యూ సదస్సు పెట్టలేదని ఒకవేళ రెవెన్యూ సదస్సులు పెట్టి ఉంటే ఆనాడే ఆ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడేవారని, గత పాలకులు చేసిన తప్పులను ఇప్పటికీ గ్రహించడం లేదని వారికి జ్ఞానోదయం కావడం లేదన్నారు.
గతంలో 2020- ధరణి చట్టాన్ని తీసుకువస్తే మేం దానిని బంగాళాఖాతంలోకి విసిరేసి సామాన్య ప్రజల కోసం 2025- భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చాం పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు
లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాసగృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం అన్నారు.
భూ భారతి సమస్యల పరిష్కారానికి గాను తమ కార్యాలయం, సిసిఎల్ఎ కార్యాలయంను అనుసంధానించే టోల్
ఫ్రీ నెంబరును త్వరలో ప్రజలకు తెలియజేస్తాం అని తెలిపారు.
గిరిజన, గిరిజనేతరులు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి
ఒక కమిటీని నియమిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
2020 ధరణి చట్టంలో సాదా బైనమ అనే అంశాన్ని గత ప్రభుత్వం తొలగించిందనీ అన్నారు. గతంలో రైతులు సాదా బైనామ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 9 లక్షల 24 వేల దరఖాస్తులలో సక్రమంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా భూమిపై ఎవరైతే కాస్తు లో ఉంటారో వారికే పాస్ బుక్ ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు.
గ్రామాలకే రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. ధరణి పార్ట్ బి లో ఉన్న ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల పేదవారి భూములకు భూభారతి 2025 చట్టం ద్వారా పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

నాయకుల స్వార్థం కోసం గాని, వారి ప్రయోజనాల కోసం చేసే చట్టం కాదు కేవలం పేద ప్రజల ప్రయోజనాల కోసం చేసిన చట్టమే భూభారతి చట్టం అని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది అన్నారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందనీ, పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు అని, కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ మంత్రులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు స్వయంగా పేదవాడి కష్టాన్ని వారి సమస్యలను తెలుసుకోని
వాటి పరిష్కారం చూపాలన్నారు.
రైతులు తొందరపడి భూభారతి చట్టం ద్వారా తమకు న్యాయం జరగలేదని ఎవరూ కూడా అపోహలకు నిరాశ నిస్పృహలకు లోను కావద్ధని అన్నారు.

రైతులకు భూభారతి చట్టం అమలు విషయంలో ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ
భూభారతి చట్టంతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రైతులందరికీ తల్లి లాంటి భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
రైతులు ఎవరు మధ్యవర్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు.
స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని
అన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు.
చట్టాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఈ కార్యక్రమాన్ని అవినీతి రహితంగా కొనసాగించాలని సూచించారు.
తప్పులు చేసే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ…
తల్లికి బిడ్డకు ఎలాంటి సంబంధం భూమికి రైతుకు అలాంటి సంబంధం.
రైతుల సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి చట్టం.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
పేదల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, తల్లి బిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో అదే తరహాలో భూమికి రైతుకు సంబంధం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులు ఆత్మహత్యలకు కారకులు అయ్యారని, నేడు రైతుల భూ సమస్యను పరిష్కరించడానికి సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. కాస్తూలో ఉన్న నిజమైన రైతులకు భూమి హక్కు పత్రాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని, భూమి రైతుకు ఆదాయం బలమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రైతులు పండించిన సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా పండించిన సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి బియ్యం రూపంలో తిరిగి ప్రజలకే ఉచితంగా అందిస్తున్నదని అన్నారు. ధరణి పేరుతో గత పాలకులు రైతులను దగా చేశారని, అధికారులను బెదిరించి గత ప్రభుత్వ నాయకులు అక్రమంగా వందల ఎకరాల భూములు వారి పేరు మీద నమోదు చేసుకొని కోట్లాది రూపాయల రైతుబంధు దిగమింగారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూములతో పాటు ప్రభుత్వ భూములను కాపాడేందుకే ప్రభుత్వం నూతన చట్టాన్ని తెచ్చిందని, నూతన చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ అప్పులు తీర్చుతూ సంక్షేమ ఫలాలను అందిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 59 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పలు వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించాలని కోరారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు
మాట్లాడుతూ భూభారతి చట్టంతో రాష్ట్రమంతటా పండగ వాతావరణం మొదలైందని అన్నారు. ఈ చట్టంపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు,
జిల్లా కలెక్టర్ లు స్వయంగా ప్రతి రైతుతో మాట్లాడుతూ చట్టంపై అవగాహన పెంచుతూ రైతుల భూ సమస్యలను తెలుసుకుంటున్నారని వివరించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా , ఏ భూమి పై కాస్తు లో ఉన్నారో , వారి ఆధీనంలో ఉన్న భూమిపై హక్కు ఎలా కల్పించాలో ఈ చట్టం వివరంగా ఉందని స్పష్టం చేశారు.
మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల కళ్ళలో ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు వాగ్దానంలో అన్నింటిని అమలు చేస్తున్నామని, ఇచ్చిన వాగ్దానాలు కాకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో నిరుపేదలు కడుపునిండా తిండి తింటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఎన్ ఆర్ నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు ధరణి పేరుతో రైతులను దగా చేశారని, గత పది సంవత్సరాలుగా రైతులకు భూములపై హక్కులను కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఆర్వోలను అన్యాయంగా తొలగించి ఆవేదనకు
గురి చేశారు అని, దున్నేవాడికే భూమి హక్కులు ఇవ్వాలని ఉద్దేశంతో భూభారతి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. తీసుకువచ్చిన నూతన చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల పాపం తగిలే గత ప్రభుత్వం ఓటమి పాలైందని అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు
రైతులను ఎవరికి ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కోసం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
2025 భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి కలిగి ఉండాలని సూచించారు. నూతన చట్టంలో 14 రకాల వెసులుబాటు పొందుపరచడం జరిగిందని అన్నారు.
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను స్థానిక రెవెన్యూ ,
ఆర్డిఓ, జిల్లా కలెక్టర్ సత్వరమే పరిష్కరించే అవకాశం ఉన్నందున
ఈ చట్టంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
మ్యూటేషన్ ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసం స్థానిక రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేసుకున్న గ్రామాన్ని సందర్శించి వివరాలను పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు.
భూమి సర్వే నెంబర్ , సరిహద్దులు , పూర్తి వివరాలు ఏర్పాటు చేసి ప్రతి భూమికి భూదార్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
భూధార్ నెంబర్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని
స్పష్టం చేశారు. ఈ చట్టంతో ప్రతి సమస్యకు పరిష్కారం చేయడానికి అధికారాలు చట్టబద్ధంగా స్థానిక తహసిల్దార్, ఆర్డీవో , జిల్లా కలెక్టర్ అధికారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు.
భూభారతి చట్టం అమలులో జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో శ్రద్ధ గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎవరూ కూడా మధ్యవర్తులతో దళారులతో మోసపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమములో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, రెవిన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాష్,
ఆర్ డి ఓ వెంకటేష్, జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సాoస్కృతిక కళాకారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.