హనుమకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా రెవెన్యూ మండలాల ప్రాతిపదికగా రైతు పరపతి సేవల కోసం పిఎసిఎస్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సంఘాల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఆత్మకూరు మండలం పెంచికలపేట, పెద్దాపూర్, శాయంపేట మండలం శాయంపేట, ధర్మసాగర్ మండలం ధర్మసాగర్, కమలాపూర్ మండలం కమలాపూర్, కాజీపేట మండలం కాజీపేట దర్గా, హసన్పర్తి మండలం వంగపహాడ్ ఏరియాలలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధీ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, రైతులకు ఉపయోగపడే విధంగా గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, నాబార్డ్ అధికారి చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ నజీర్ సుల్తాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.