నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రూ. లక్ష చొప్పున తొలి దశ బిల్లుల మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల ఆశయాన్ని సాకారం చేసేందుకు గాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకే ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా ప్రతి మండలంలోని ఒక గ్రామం చొప్పున గత జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిందన్నారు.
బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు, పైకప్పు స్థాయి దాటిన తర్వాత లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయ్యాక రూ. 2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన లక్ష రూపాయలతో కలిపి ఇలా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తోందన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొదటి విడతలో భాగంగా మొత్తం (716) మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు.
ఇందులో (354) మంది ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేయగా, (97) మంది లబ్ధిదారులకు బేస్మెంట్ స్థాయి వరకు ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా తొలి విడతగా.. బేస్మెంట్ దశ నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి లక్ష రూపాయల చొప్పున ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, జనగామ జిల్లాకి సంబంధించి బెస్మెంట్ పూర్తయిన నిర్మాణాలకు ఇప్పటివరకు మొత్తం (43) మంది లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున నిన్న (గురువారం) వారి అకౌంట్లలోకి ప్రభుత్వం నగదు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. మిగతా లబ్ధిదారులకు కూడా రేపటి లోగా జమ అవుతాయన్నారు.
మిగిలిన గ్రామాల్లో కూడా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ లోపు మండల స్థాయి అధికారులు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి, మే 2వ తేదీన గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తామని, మే 5వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
జనగామ జిల్లా లబ్ధిదారుల స్పందన
చాలా సంతోషంగా ఉంది
తనకు ఇళ్లు లేదని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటిని మంజూరు చేసిందని, బేస్మెంట్ పూర్తి కాగా రూ. లక్ష అకౌంట్ లోకి వచ్చాయని, రేపటి నుంచి ఇటుక గోడల నిర్మాణం మొదలవుతుందని అన్నారు. ఈ సందర్భంగా తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
మర్రోజు రేణుక, నర్మేట మండలం, బొమ్మకూర్ గ్రామం

మాకు ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకుంటాం
మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. సొంత ఇల్లు ఉంటే బాగుండని అనుకునేవాళ్లం. సీఎం సారు పుణ్యమా అని ఇల్లు వచ్చింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మా కుటుంబం అంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. ఇప్పుడు మాకు కూడా సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకుంటాం.
గోనె హంసమ్మ, జనగామ మండలం, ఎర్రగుంట తండా గ్రామం
ముఖ్యమంత్రి సారుకు ధన్యవాదాలు
సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్నాం. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు ఇల్లు ఇస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పేదోళ్ల సొంతింటి కళ నెరవేర్చిన సారు నిండు నూరేళ్లు బతకాలి.
ముదావత్ శిరీష, తరిగొప్పుల మండలం, వాచ్యా తండా గ్రామం